మాకు వద్దు బాబోయ్ ఈ మెప్మా అంటూ పలువురు అర్బన్ పొదుపు మహిళా సభ్యుల ఆక్రందన. గతంలో ఎన్నడూ లేని విధంగా మరియు రూరల్ పరిది లోని DRDA/SERP లలో కూడా లేని విధంగా పొదుపు సంఘాలకు కూడా ఆడిటింగ్. ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా గల 123 ULB లలో విధిగా జిల్లా సహకార అధికారి గారికి సమర్పించడానికి వీలుగా 9048 స్లమ్ లెవెల్ ఫెడరేషన్(SLF)లకు మరియు 209 టౌన్ లెవెల్ ఫెడరేషన్లకు(TLF) మాత్రమే ఆడిటింగ్ నిర్వహణ తప్పనిసరిగా చేయాలి.
కానీ ఈసారి అవసరం లేకున్నను మెప్మా పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా గల 2 లక్షల 75 వేల 502 సంఘాలకు కూడా ఆడిటింగ్ నిర్వహిస్తుండడం గమనార్హం. ఇది ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయల వ్యయం కాగల ఆడిటింగ్ ప్రాజెక్టు దీనికి కావాల్సిన ఫీజు రుసుములను కూడా సదరు నిరుపేద సంఘ సభ్యులే భరించాలి. ఇంత పెద్ద మొత్తం లో పొదుపు సభ్యుల నుంచి వసూళ్లు చేస్తున్ననూ దీనిపై సరియైన పారదర్శకత లేకుండానే గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన ఆడిటింగ్ సంస్థకే 16 జిల్లాలలో ZUSల ఆమోదంతో ఇచ్చారు. దీనినే యధావిధిగా మెప్మా కేంద్ర కార్యాలయంలో మే 15వ తేదీన ఆమోదించేశారు. ఆడిటింగ్ నిర్వహించే సంస్థలు ముందస్తుగా ప్రతి గ్రూపు కి 50 రూపాయలు చొప్పున కాషన్ డిపాజిట్ గా డిమాండ్ డ్రాఫ్ట్( DD) చేయవలెను అని చెప్పి, తరువాత ఆ నిబంధనను తుంగలో తొక్కి చివరికి వారి నుంచి చెక్కుల రూపంలో తీసుకున్నారు.
అది ఒకే గుత్తేదారుడు గత ప్రభుత్వంలో పలు జిల్లాలలో ఆడిటింగ్ నిర్వహణలో చక్రం తిప్పిన సంస్థకే మరలా కట్టబెట్టిన వైనం అలాగే ఆ గుత్తేదారుడు అప్పట్లో పలువురు పీడీలు జిల్లా ఐబీలతో కుమ్మక్కై పొదుపు సభ్యులకు ఇచ్చే బుక్స్ ప్రింటింగ్ నిర్వహణ కూడా అనధికారికంగా నిర్వహించేవారు.
మెప్మా కేంద్ర కార్యాలయం తాడేపల్లి అడ్డాగా ఓ రాష్ట్రస్థాయి ఔట్సోర్సు ఉద్యోగి ఈ తతంగానికి అంతటికి రింగ్ లీడర్ ఇతను పలు జిల్లాలలో PDలు IBలతో మంతనాలు జరపడం ఆ సంస్థకే దక్కేలా చూడడం అతని పని.
గత ప్రభుత్వంలో మెప్మా పరిధిలో పలు SLF/TLF లలో మెప్మా అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై పొదుపు సభ్యుల సొమ్ములను కాజేసి ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇలాంటి అవకతవకలు తెలియాలంటే ఓ నిబద్ధత కలిగిన ఆడిటింగ్ సంస్థతో ఆడిటింగ్ నిర్వహణ జరిపించాలి కానీ అప్పట్లో చక్రం తిప్పిన ఆడిటింగ్ సంస్థకే 16 జిల్లాలలో 1,50,000 పొదుపు సంఘాల ఆడిటింగ్ నిర్వహణ అప్పగించడం మెప్మాలో జరుగుతున్న లోపాయి కారీతనానికి నిదర్శనం.
మెప్మాలో గత 5 సంవత్సరాలలో జరిగిన పలు కుంభకోణాలను ప్రభుత్వం తక్షణ విచారణ జరిపి నిజా నిజాలు నిగ్గు తేల్చ వలసినదిగా పలువురు పొదుపు సంఘ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుచున్నారు. అప్పట్లో మెప్మా అధికారులు, లీడ్ బ్యాంకు అధికారులు, రాజకీయ నాయకులతో కుమ్మక్కై మెప్మా ని పలు చోట్ల పూర్తిగా లూటీ చేసేశారు. మెప్మా లో ఉన్న ఇలాంటి చీడ పురుగులను ఏరి వేయకపోతే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తన మానస పుత్రికగా చెప్పుకునే డ్వాక్రా గ్రూపుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. దీని పర్యావసానంగా ప్రభుత్వం మహిళా సంఘాలపై పూర్తిగా పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది.