నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన జొన్నవాడ గ్రామం నందు పెన్నా నది పరివాహక ప్రాంతంలో జల కాలుష్యం పై ఫిర్యాదు. సింగిరి మధు అనే స్థానికుడు యొక్క ఫిర్యాదు ఆధారంగా సంబంధిత అధికారులు గ్రామము నందు పర్యటించి గ్రామ పంచాయతీ మరియు గుడి యొక్క పరిసరాలలో అపరిశుభ్రతపై మరియు మురుగు నీరు పెన్నా నదిలోకి ఎలా చేరుతుందో అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు. ఫిర్యాదుదారుడు అపరిశుభ్రతపై, గుడి యొక్క పరిసరాలలో ఉన్న స్ధానిక గృహాలు మరియు విశ్రాంతి వసతి గృహాలలో నుండి వచ్చే మురుగు నీరు పెన్నా నదిలోకి ఎలా చేరుతుందో అనేదానిపై గతంలో సంభందిత అధికారులకు ఫిర్యాదు చేసి ఉన్నారు. రోజుకు 5 వేలకు పైగా భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రమైన జొన్నవాడ కామాక్షమ్మ గుడి పరిసరాలలో పరిశుభ్రత ప్రమాణాలు లోపించి ఉన్నాయి, ఇక్కడ భక్తులు బస చేసే గెస్ట్ హౌస్ ల నందు నుంచి వచ్చే మురుగు నీరును నేరుగా పెన్నా నదిలోనికి కలుపబడి ఉన్నది. అలాగే గుడిలో నుంచి వచ్చే వ్యర్ధాలు నిర్వహణలో కూడా లోపం కొట్టి వచ్చినట్టు కనిపిస్తున్నది. నెల్లూరు జిల్లా ప్రజలు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భావించే జొన్నవాడలో అటు పంచాయితీ అధికారులు కానీ దేవస్థానం మేనేజ్మెంట్ గాని దీనిపై ఇప్పటి వరకు సరియగు చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. పెన్నా నదిలోకి చేరుతున్న కలుషిత నీరు మరియు పరిసరాల అపరిశుభ్రతపై పై అధికారులకు నివేదిక పంపించనున్నట్లు అలాగే ఇక్కడ వ్యర్ధాల నిర్వహణ ఏర్పాట్లకు కావలసిన బడ్జెట్ వివరాలను పై అధికారులకు పంపనున్నట్లు బుచ్చిరెడ్డిపాలెం మండల ఎంపీడీవో గారు తెలిపినారు. అలాగే దేవస్థాన ఈవో గారికి కూడా పరిసరాల అపరిశుభ్రతపై తీసుకోవలసిన చర్యలపై తగు సూచనలు చేసినారు.



