హైదరాబాద్:తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం హైదరాబాద్లోని తన జూబ్లీహిల్స్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అత్యంత కీలకమైన రాజకీయ ప్రకటన చేశారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (2029) జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, రాష్ట్రంలో తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత బలోపేతం చేయబోతున్నామని ఆయన స్పష్టం చేశారు.
హైడ్రామా మధ్య ప్రెస్మీట్
గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో జనసేన పార్టీ అంతర్గత శ్రేణులతో నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడం, ఆపై హైకోర్టు కూడా పిటిషన్ను తిరస్కరించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన నివాసంలోనే అత్యవసర విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
“ఇది భారతదేశం, ఇక్కడ ఎవరూ ఎవరి హక్కులను కాలరాయలేరు. తెలంగాణ ఎవరి జాగీరు కాదు. ఇప్పటివరకు నేను దీనిపై పెద్దగా ఆలోచించలేదు, కానీ ఇక్కడి మా నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. తెలంగాణలో జనసేన వెనకడుగు వేసే ప్రసక్తే లేదు” అని పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ టార్గెట్.. కేసీఆర్పై ప్రశంసలు
ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
- జాతీయ నేతల పోటీపై ప్రశ్న: “ఇందిరా గాంధీ మెదక్ నుండి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర ప్రాంతాల నుండి పోటీ చేసినప్పుడు లేని అభ్యంతరం, నేను తెలంగాణకు వస్తే ఎందుకు?” అని ప్రశ్నించారు.
- ఆంధ్రా ప్రజల భద్రత: హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉంటున్న ఆంధ్రా మూలాలున్న ప్రజలను పదే పదే టార్గెట్ చేయడం సరికాదని హితవు పలికారు.
- కేసీఆర్పై ప్రశంసలు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో బిఆర్ఎస్ వ్యవస్థాపకుడు కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పాత్రను ప్రశంసించిన పవన్, ప్రస్తుత కాంగ్రెస్ వైఖరిని తప్పుపట్టారు.
పొత్తులపై స్పష్టత
బీజేపీ, టీడీపీలతో ఏపీలో పొత్తు ఉన్నప్పటికీ, తెలంగాణ ఎన్నికల విషయంలో తాము స్వతంత్రంగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ హింట్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ, తెలంగాణలో తమ పార్టీ నాయకులకు కూడా పూర్తి స్వేచ్ఛ ఇస్తానని, రాబోయే రోజుల్లో తానే స్వయంగా తెలంగాణ అంతటా పర్యటిస్తానని స్పష్టం చేశారు.
తాను తెలంగాణ ఏర్పాటుకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కేవలం విభజన జరిగిన తీరును మాత్రమే ప్రశ్నించానని చెబుతూ.. “తెలంగాణ నా గుండెల్లో ఉంటుంది, ఇక్కడి సంస్కృతి అంటే నాకు అపారమైన గౌరవం” అని పవన్ కళ్యాణ్ తన 50 నిమిషాల ప్రసంగాన్ని ముగించారు.
– బ్యూరో రిపోర్ట్, హైదరాబాద్.